భజేవాయుపుత్రం ! భజే బ్రహ్మతేజం!
శ్రీ ఆంజనేయునిజ్ఞాన లక్షణములను ఎఱింగి, ఏ కోరికలు లేనివాడని, పరమాత్మనే మనస్సునందు నిలిపినవాడని గ్రహించిన శ్రీరామచంద్ర ప్రభువు, సీతమ్మ తల్లి ద్వారా । ఆంజనేయుడు జ్ఞానము పొందుటకు యోగ్యుడని శ్రీరామతత్త్వమును ఉపదేశించమని సాక్షాత్తు నారాయణుడే ఆజ్ఞాపించెనని, అమ్మవారు పరమాత్మ ఆత్మ, అనాత్మ తత్త్వములను గూర్చి హనుమంతునికి వివరించెను. ఇది త్రేతాయుగమున మాట. మరి ద్వారపయుగములో చూసిన గోవిందుడగు శ్రీకృష్ణపరమాత్ముని ముఖపద్మములనుండి అమృతవాక్కులై వెలువడిన భగవద్గీత సాక్షాత్తుగా అర్జునునితో పాటు రధము యొక్క టెక్కముపై ఆసీనుడైన కపివరుడు కూడా వినెను. నారాయణుడు మళ్లి ద్వాపరయుగములో కూడ ఆంజనేయునికి ఆత్మ అనాత్మ తత్త్వములను గూర్చి వివరించెను.
ఒక అవధూతకు ఉండవలసిన లక్షణములన్ని ఆంజనేయునిలో సంపూర్ణముగా కనబడుచున్నవి. హనుమంతుడు రామునితో "ఓ రామా ! కొన్ని సమయాల్లో నువ్వు పూర్ణం, నేను నీ అంశనని, కొన్ని సమయాల్లో నువ్వు ప్రభువు, నేను దాసుడననీ, కాని తత్త్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతానని అన్నారని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు.
బ్రహ్మజ్ఞానము అంటే వేదంతవిద్య గాక మరియే ఇతర విద్యయు సాధనములు కాదని ఎన్నో పురాణములు, శాస్త్రములు విశదీకరించబడినవి. సమస్త విద్యలకు ఆత్మజ్ఞాన విద్యయే ఉన్నతమైనది, అగ్రశ్రేణి యని ఎందరో మహాత్ములు చెప్పిరి. ఈ బ్రహ్మవిద్య సమస్త విద్యలలో అతి పవిత్రమైనది. మోక్షసిద్ధికి ఇదే మార్గము. బ్రహ్మజ్ఞానము పొందుటకు అనేక జన్మ సుకృతవిశేషమున గాని లభ్యమవ్వదు. ఆంజనేయుడు ఆత్మవిద్యా ప్రబోధమునకు సంపూర్ణ అధికారి అని ఎన్నో చోట్ల గమనించవచ్చును.
హనుమంతుడు చక్షురాదీంద్రియములకు విషయములైన శబ్ద స్పర్వ రూపాది విషయములను విడచిపెట్టి, త్యాగిగా, యోగిగా, బ్రహ్మచారిగా భోగములను విడిచి, వైరాగ్యముతో, ఆత్మ దేహాదుల కంటె భిన్నమైనదని వాటికి సాక్షిగా ఉంటూ, చైతన్యమనే ఆత్మగా ఎఱింగి జ్ఞానిగా, మనోధర్మములను ఆత్మధర్మములను ఎఱింగి కర్తను, భోక్తను నేను కానని తలంచి, ఏ బంధములు లేక ఆత్మ స్వరూపమును నెఱింగి తానే పరబ్రహ్మస్వరూపుడై బ్రహ్మతేజోవంతుడై, అమరుడై, చిరంజీవిగా వర్థిల్లెను. రామాయణంలో
సుందరకాండము యొక్క ఘటాన్ని పరిశీలిద్దాం. ఈ ఘట్టం సుందరే సుందరం కావ్యం. అందుకే సుందరే సుందర కపి. లంకేశ్వరుడు అపహరించిన సీతాదేవి యొక్క జాడ తెలుసుకొనుటకై, వానరులందరు శ్రీరామచంద్రుడు, జాంబవంతాది వీరులు అందరు ప్రేరేపింపగా, తను నమ్ముకున్న రామనామముతోన, తన హృదయములో తన ఆత్మయే శ్రీరామపరమాత్మగా తలంచి, కాయమును పెంచి, ఒక్కసారిగా జై శ్రీరామ్ అంటూ కుప్పించి ఎగిసెను మారుతి. అంత పెద్ద సమద్రమును రామనామం జపిస్తూనే గాలిలో తేలుతూ నీటిలో పడక ప్రయాణం కొనసాగించెను ఆంజనేయుడు. ఆత్మజ్ఞాని ఎదుట కనిపించెదంతా మిథ్యగా భావిస్తారు. ఆంజనేయుడు కూడా ఆ కనిపించే సంద్రము మిథ్యగా భావించినాడు. కాబోలు పర్వతరాజు, సముద్రదేవుడు, దేవదేవాదులు ఈ కార్యమును చూసి ఆశ్చర్యముతో గడగడ వణికిరట. అంత శక్తి సామర్ధ్యములు హనుమాన్కి ఉన్నా, తన శక్తిని తాను ఎరుగక, తన చుట్టూ వున్న వానరులు ప్రోద్బలప్రేరేపితముతో ఇంతటి కార్యం సాధించెను. ఇది ఒక యోగి లక్షణం. మైనాకుడు హనుమంతునికి స్వాగతం పలికి పూజలను, గౌరవ సత్కారములు అందుకొమ్మని హనుమంతుడిని వేడగా రామకార్యమే ముఖ్యమని ఆ కార్యమును సాధించువరకు మధ్య ఆగనని క్షణమైన ఎంతో విలువైనదని పలికినాడు మైనాకునితో హనుమాన్. ఇక్కడ గమనించవలసిదని ఆంజనేయుడు ఎటువంటి సత్కారములు, పూజలు, గౌరవమర్యాదలు తనకు అవసరము లేదని, కందమూల ఫలములను కూడా గ్రహించక తన ఆత్మ రాముని కార్యమే ముఖ్యమని తలచి పయనించెను. తాను దేహము అనుకున్నప్పుడు ఆకలి, దప్పికలు, ఆడంబరాలు అవసరం. ఇక్కడ ఆంజనేయుడు గొప్ప జ్ఞాని. ఆత్మతత్త్వం తెలిసివున్న ధీరుడు. కావుననే వాటిని లెఫ్టిచేయలేదు.
సురస అడ్డగించినపుడు సూక్ష్మబుద్ధిగొని బొటను వేలంతవాడిగా మారి సురసముఖమున జొచ్చి తిరిగి వెలుపలికి వచ్చెనట విజయుడై. అంత సురస కూడా ఆశ్చర్యమునొంది హనుమంతుని సాహసమును మెచ్చి దీవించెనట. సింహిక రాక్షసిని తనకు అడ్డుగా వచ్చినప్పుడు అడ్డు తొలగించుటకు వధించెను. హనుమంతుని నిష్కామకర్మ ఎంత గొప్పదో. రామకార్యమునకు అడ్డువచ్చిన శత్రువును వధించెను. ఇది పాపకర్మ అవ్వదు. తన కర్మ ప్రతిఫలాన్ని ఆశించుటలేదు నిష్కామముతో చేస్తున్నది కాబట్టి. భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునునికి చెప్పింది ఇదే. ఆంజనేయుడు ఎంతటి కర్మయోగియో కదా !
వారధి దాటిన ఆంజనేయుడు లంకను చేరెను. తాను పెంచిన కాయమును చిన్నది చేసి తదుపరి కార్యము యోచన చేసినాడట. ఆహా ఎంతటి జ్ఞానియోగి కదా ! ఎటు చూసిన మేడలు, గృహములు, స్వర్ణప్రాకారములు, ఉద్యానవనములు, జలాశయములు, వీధులు గల లంకను
పరిశీలించెను. అతి బలవంతులైన రాక్షసవీరులను చూసెను. హనుమంతుడు రాత్రి వేళన సూక్ష్మరూపుడై పిల్లిలాగా మెల్లగా లంకాద్వారమునకు చేరినాడు. అది గమనించిన లంకారాక్షసి అడ్డగించినది. ఆంజనేయుడు సౌమ్యముగా సుందరమైన లంకను చూడటానికి వచ్చానని, చూసి మరల వెళ్లెదనని పలికినా లంకా రాక్షసి ఆంజనేయుని మాటను లెక్కించక కొట్టెను. మారుతి తన కాయమును కొండంతగా పెంచి ఎడమచేతితో పిడికిలి బిగించి ఒకే దెబ్బతో ఆ రాక్షసిని కూల్చినాడు. ఆ దెబ్బకి కనులప్పగించినది. ఆ రాక్షసి. హనుమంతుడు అబలను చంపుట ధర్మముకాదని దయతో వదిలిపెట్టినాడట. ఆహా ఆంజనేయా! ఎంతటి దయామయుడవో, ధర్మము తెలిసినవాడవో కదా ! లోనికి దూకిన ఆంజనేయుడు సువర్ణమైన మేడలను, ధగధగలాడే గృహములు, అప్సరసలవంటి స్త్రీలను, నృత్యగీతాలు, గానమాధురులను వెలుగుచు ఉండే లంకను చూసాడు ఆంజనేయుడు. ఇన్ని భోగభాగ్యములతో నిండిన దృశ్యమును, కామినీ కాంతలతో నిండిన స్థలములను చూసినప్పటికి నిశ్చలుడై, స్థితప్రజ్ఞునిలా ఆంజనేయుడు వాటినన్నిటిని మరచి తన కార్యమునే తలచి ముందుగా సాగుతున్నాడు. విషయవాంఛలతో పనిలేనివాడిగా, ఇంద్రియములతో ముడిపడలేదు, ఆత్మ తత్త్వజ్ఞుడై నిలిచినాడు హనుమంతుడు. కనకమణిమయ భూషణధారులైన స్త్రీలను, మధువు గ్రోలి మల్లిల్లిన రమణులను మొండిమొలతో శయనించివారిని, కామినీమణులను చూసినను కామక్రీడలతో తెలుతున్నవారిని చూసినను హనుమంతుడు చలించలేదు. తన తల్లి జానకి కోసం వెతుకుతున్నాడు. గృహములు, నిశాగృహములు, క్రీడా గృహాదులు, లతా గృహములు, ఆరామములు, చిత్రశాలలు, బాటలు అన్ని చూసినను సీతమ్మతల్లి గానక మారుతి వెతుకుచుండెను. ఒకవేళ సీతాజాడ తెలియక పోయినచో తాను అగ్నిలో దూకెదనని హనుమంతుడు కృతనిశ్చయుడైనాడట. కిష్కింధకు సీతజాడ తెలియలేదని వార్తను తీసుకొనిపోవుటకు తాను సమ్మతించిలేదు. తన దైవమైన శ్రీరాముని సంతోషమే తన సంతోషమని భావించిన మహానుభావుడు. తన తండ్రియైన శ్రీరాముని కొఱకు, ఆ రాముని సుఖమునకై తన ప్రాణాలను తెగించి, సీత్మమ్మ తల్లి జాడకై వచ్చిన హనుమంతుడు ఒకవేళ సీతమ్మ తల్లిజాడ తెలియకున్న తన ప్రాణాలను ఆహుతి గావించుటకై సిద్ధపడిన త్యాగి హనుమంతుడు. అశోకవనమున ప్రవేశించినాడు హనుమంతుడు, ఎటు చూసిన రాక్షసవీరులు కావలిగా నిలిచిరి. ఆ అశోకవనమునకు రామకార్యమును నెరవేర్చుటకై మారుతి వామనరూపమున దాల్చినాడు. పూవులనిన, పూతీవియలనిన సీతాదేవికి ఇష్టమని తలచి చెట్టుపై కూర్చుని చూచుచుండెను. తను కూర్చునివున్న తరువు క్రిందన చిక్కిన సీతను గాంచెను మారుతి. పతివియోగ శోకాగ్నితో వేగిన, మాసిన వస్త్రమును ధరించిన, నిట్టూర్పులు గక్కుతున్న ఆ తల్లిని చూచెను ఆంజనేయుడు. సీత తన సొమ్ములన్ని శాఖలకి తగిల్చె, నవరత్నాంకిత మణిహారములు
చూచి, రాముడు తెలిపిన గురుతు కలిగిన ఆభరణములను గుర్తించెను. సాక్షాత్ లక్ష్మీదేవినే చూసి సీతగాక మరెవరని తలచి పొంగిపోయెనట హనుమంతుడు. ఎంతటి నిస్వార్థసేవయో కదా ! ఇంతలో రావణుడు అక్కడకు వచ్చె. దశకంఠుడు సీతపైన చూపులు నిలిపెను. మరచిపోమ్ము ఆ రాముని, పట్టపురాణిగా చూచుకొందునని గర్వముతో రావణుడు సీతతో పలికెను. సీత రావణుడిని తృణము కన్నా హీనముగా భావించెను. పరకాంతను ఆశించుట పాపమని సీతారాములను విడదీయలేవని, ప్రయత్నించి హాని కల్గునని రామణ్ని శరణువేడుమనె సీతాదేవి. రామునితో వైరము మానుమనెను. రావణుడు ఒసగిన గడువు రెండు నెలలలో తీరిపోవునని తలచి దుఃఖించుచుండెను. అందున్న ఒక వృద్ధ రాక్షసియైన త్రిజట దారుణమైన కలగంటినని ఆ వృత్తాంతాన్ని తెలియపరిచింది తన తోటి రాక్షసపరివారానికి. సీతను వేడుకోమని, లేకున్న లంకకు హాని కల్గునని చెప్పినది. జానకి శోకించి, తన ప్రాణనాథుడైన శ్రీరామచంద్రుని కడసారిగా తలచి తన మెడ జడతో ఊరిబోసుకోబోయెను. ఆంజనేయుడు సీతా మాత ప్రాణములను రక్షించదలచి సీతారాముని కథ మృదుమధురముగా పలినినాడు. జానకీమాత భయముతో నలువంకలు గాంచి పైకి చూచెను. శాఖలనడుమ బాలునివలె మారుతి తోచెను. చిన్నరూపమైన బ్రహ్మతేజోమయమై యున్నది.
పవనకుమారుని భీమరూపమును జానకీదేవి చూచి భీతినొందెను. ఆ తేజాగ్ని చూసిన సీతాదేవి అంతటి శక్తిమాతయే మూర్ఛనొందెనట! తిరిగి మేల్కొని సీత ఆంజనేయుడిని చూసి అనుమానించినది. రావణుడే ఈ వానరుడని, కామరూపుడై వచ్చెనని తలచినది. ఆంజనేయుడు సీతామాతకి నమస్కరించి వినయవిధేయుడై తన రాక గురించి వివరించి తాను రాముని బంటునని, హనుమంతుడనని, సీతాజాడకై వచ్చినానని రామలక్ష్మణులతో, వానరసైన్యముతో లంకను చేరెదనని మారుతి పలికెను. రామలక్ష్మణుల రూపురేఖలను వర్ణించానాడు హనుమంతుడు. మారుతి ఎంతగా తన ఆరాధ్యదైవాన్ని మనసులో నింపుకొని అనునిత్యం కొలవడంవలననే ఆ రామలక్ష్మణుల రూపాలను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించినాడు. ఆంజనేయుడు ఆత్మయే పరమాత్మ ! ఆ పరమాత్మే శ్రీరాముడే ! ఋష్యమూకమున సీతాపారవైచిన సొమ్ములన్నీ రాముడి కడ కలవని రాముడు పంపిన అంగుళీయకము భక్తిమీరగ సీతకొసగెను. సీత సంపూర్ణయై విశ్వాసముతో హనుమంతుని పొగిడెను. ఆంజనేయుని శ్రద్ధ, భక్తి ఎంత గొప్పవో కదా ! స్వామి కార్యమును నెరవేర్చుటకై ఎంతో శ్రద్ధతో, తనను తాను తెల్పుకొనుటకు రాముని బంటని ఋజువుచేసుకొనుటకు ఎంతో భక్తితో ఎన్నో పాట్లు పడ్డాడు. శ్రద్ధ, భక్తి, వివేకము ఈ త్రిగుణములతో వెలిగిన మారుతి. రావణుడు ఒసగిన ఏడాది గడువు రెండు నెలలలో తీరిపోవునని తల్లి సీతమ్మ
తెల్పినప్పుడు వెంటనే చెర విడిపింతునని తన వీపుపై కూర్చొనిన వచ్చిన త్రోవనే కొనిపోయెదనని పలికెను హనుమంతుడు. తన చిన్న శరీరముతో సాధ్యముకాదని సీతమ్మ పలుకగా, సీత చెంతన తన విశ్వరూపమును ప్రదర్శింపగా, కొండంతగా తన కాయమును పెంచి కాంతిమంతమై నిలచెను హనుమంతుడు. తనకు ఇంత శక్తిసామర్థ్యాలు కలిగిఉన్నను, ప్రగల్భాలు పలుకక సామాన్యుని వలె నుండి సమయము వచ్చినపుడే తన ఉగ్రరూపం చూపె ఆంజనేయుడు. సీతపైనున్న భక్తిభావమున అట్లు తెల్పెనని, క్రూరరాక్షసుల బారినుండి కాపాడుటకై అట్లు పల్కెనని ఆంజనేయుడు వినయంగా పలికెను. శ్రీరామునికి గుర్తుగా సీతాదేవి తన చూడామణిని ఇచ్చి ఆశీర్వదించి ఆంజనేయుని పంపెను. హనుమంతుడు కల్పించుకొని కలహము పెంచుటకై మరియు అసురుల యొక్క బలమును పరీక్షించుటకై మరియు రామబంటు యొక్క బలపరాక్రమ మహిమను చూపుటకై యోచన చేసి చెట్లకొమ్మలను, గిరిశిఖిరములను ముక్కలు చేసి అశోకవనమును చిందర వందర చేసెను. ఇక్కడ హనుమంతుడు తన బలపరాక్రమములను ప్రదర్శించుటకు గల కారణమ దానవులకు సామదాన బేధోపాయములు వలదని తలంచి దండోపాయమే సరియైనదని తలంచి తన బలప్రయోగమును చూపెను తప్ప తన అహంభావమును ప్రదర్శించుటకై కాదని ఎరుంగవలెను. దశకంఠుడు తన ఎనభైవేల వీరులను మారుతిపై దాడికి పంపెను. ఆంజనేయుడు తన తోకను పెంచి భూమిపై మోదెను. ఆ ధ్వనికి మృగములు, జనులు, పక్షులు బెదిరిపోయి, దిక్కులు కూడా దద్దరిల్లెను. అంతటి బల పరాక్రమ వీరుడగు ఆంజనేయుడు తలచినచో లంకను క్షణములో హతమార్చగలడు. కాని ఆ కార్యము తన ఆరాధ్యదైవమైన శ్రీరామునిదే అని ఎరిగినవాడై లంకను మొత్తము ధ్వంసము చేయలేదు. పైగా సీతాజాడ కనుగొని రామునికి తెల్పెదనని మాట ఇచ్చిన కారణంగా తన మాటను నిలబెట్టుకొనుటకై మొత్తము లంకను కూల్చలేదు. ఎనుబది వేల రాక్షసులను హతమార్చెను. జంబుమాలిని మరియు అతడి సైన్యమును, మంత్రికుమారులను విరూపాక్ష, ఉపాక్షులను మహావీరులను ఎందరినో హతమార్చెను.
సేనాపతులను సైన్యములను కూల్చెను. అక్షకుమారుని వధించెన. ఒక్క వానరుడు ఇంతమంది వీరాధి వీరులను హతమార్చినను మారుతి శక్తిసామర్ధ్యములను ఎంచుట ఎవరి తరమూ కాదు. శ్రీరాముడు, ఆంజనేయుని శక్తి ఎరుంగుటచే ఒక్కడినే లంకకు పంపెను. ఇంద్రిజిత్తు రావణాసురిని కుమారుడు. ఆంజనేయునితో పోరాడి తన బ్రహ్మాస్త్రముతో బంధింప తలచెను. బ్రహ్మవరమున బ్రహ్మాస్త్రబంధము క్షణకాలములో తొలగిపోయెను. కాని నారచీరలకే కట్టుబడినట్లు కదలక నిలిచెను మారుతి. కారణము ఆంజనేయుడు స్వయముగా రావణుని కడకు ఏగుటకై సంధి కుదుర్చుటకై రావణునికి హితబోధ చేయుటకై ప్రయత్నించదలచెను. ఆంజనేయుడు ఎంతటి ఉగ్రరూపుడో అంతటి
శాంతస్వరూపుడుని కూడా ఋజువగుచున్నది. సమయానుస్ఫూర్తిగా ప్రవర్తించుచు రామకార్యమును నెరవేర్చుటకు యత్నించెను. రావణుని కడ ధైర్యసాహసములతో నిలచి తాను రాముని దూతగా వచ్చెనని రావణుని చూడగా ఇట్లు చేసితినని రామునితో వైరము ఒక్క రావణునికే గాక యావత్తు లంకకే చేటని, సీతామాతను చెరనుంచి విడిపించమని వేడెను. రావణుడు కోపోద్రిక్తుడై ఆంజనేయుని వధింపమని, కపులకు వాలము ప్రియమని కావున దానిని కాల్చి ఊరేగింపుమని ఆజ్ఞాపించెను. అసురులు మారుతి తోకకు నిప్పటించి ఊరేగించిరి. ఆంజనేయుడు ఆత్మజ్ఞాని కావుననే అగ్ని, నీరు, వాయువు మొదలగు పంచభూతములు ఏమీ చేయలేకపోయెను. మారుతి పంచభూతాలకు అతీతుడు. జనన మరణములకు అతీతుడు. మనోధర్మములు, ఆత్మధర్మములు ఎరిగిన వాడగుటచే అగ్ని దహింపలేదు. కపివరుడు ఏ మంటలతో తన తోకను కాల్చిరో, ఆ మంటలతోనే లంకా దహనము చేసెను. చూచిరమ్మనినన కాల్చివచ్చిన విఖ్యాతి గాంచెను. ఒక్క విభీషణుడు గృహమును మాత్రము విడిచెను. తిరిగి అశోకవనమును చేరి సీతామాత క్షేమము నెరింగి శెలవు తీసికొని తిరుగు ప్రయాణము చేసెను. సీతా జాడగనిన వానరవీరులు హనుమంతునికి ఘనస్వాగతము పలికిరి. ఆంజనేయుడు సీతను చూసిన శుభవార్త తన తండ్రియైన శ్రీరామచంద్రునకు తెల్పెను. తన లంకాయానము కూడా విపులముగా తెల్పెను. చూడామణిని శ్రీరామునకు ఇచ్చెను. లంకాదహనమును వర్ణించెను. సీతక్షేమమని శుభవార్త వినిన శ్రీరామచంద్రుడు ఆంజనేయుని కౌగిలిచేర్చెను. సాక్షాత్తు నారాయణ భగవానుడే ఒక వానరుణ్ణి ఆలింగనము చేసికొనెనన్న ఆంజనేయుని సగుణలక్షణములు ఎన్ని ఉంటే శ్రీరాముడు అంతటి మహాకార్యమును చేసెనో గదా! శ్రీరాముడు పూర్ణుడు. ఇక్కడ ఆంజనేయుడు రాముని అంశయే యని శ్రీరాముడు ప్రభువు, ఆంజనేయుడు దాసునిగను మరియు ఆత్మతత్త్వముతో చూస్తే శ్రీరాముడు, ఆంజనేయుడు ఒక్కరే. శ్రీరాముడు మిక్కిలి ప్రసన్నుడై కోరినదేదైనను ఇచ్చెదనని అనగా రామునికి నమస్కరించిన ఆంజనేయుడు ఇట్లనెను. "రామా ! నీ నామము ఎంతగా స్మరించినను నా మనస్సు తృప్తి చెందుట లేదు. కావున నీ నామము సదా స్మరిస్తూ భువిపై నిలువలెనని నీ నామము లోకము నందు ఎంతవరకు నిలుచునో నా శరీరము అంతవరకు నిలిచియుండుగాక ! ఇదే నాకు అత్యంతముగా ఇష్టమైన వరమని కోరెను. శ్రీరాముడు ప్రసన్నుడై వరము నొసంగెను. ఆంజనేయుడు ఏ వరమును, కోరికను కోరలేదు. నిస్వార్ధబుద్ధితో ఒక్క రామనామస్మరణమును సదా స్మరిస్తూ ఉండవలెనని భోగభాగ్యాలను మరి యే ఇతర కోర్కెలు కోరని యోగి పుంగవుడు. రావణుడి వధ అనంతరము శ్రీరామ పట్టాభిషేక తదనంతరము సీతామాత ఆంజనేయునికి కోటి చంద్రుల వెన్నెలను కురిపించే మణి రత్నములను పొదిగిన హారమును ప్రేమతో కానుకగా హనుమాన్కి ఇచ్చెను. ఆంజనేయుడు ఆ
హారమును ఒక్కొక్క పూసను కొరుకుతూ పరీక్షించుచుండెను. కారణము ఏమని అడుగగా తన గుండెలో కొలువైయున్న శ్రీరాముడు ఆ దండలో లేడని భావించి ఆ హారమును పారవైచెను. నవరత్నములతో మెరిసే ఆ హారమును గ్రహింపక ఆ హారములో కూడా తన రాముని వెదుకుటకై యత్నించిన మహానుభావుడు, ఆ మారుతి దేవుడు. ఆభరణములకీ, వస్తువులకీ, ధన, కనక, వస్తు, వాహనములకీ లొంగనివాడు, ఇంద్రియలోలుడు కానివాడు బాహ్య ప్రపంచదృశ్యమునకే ఆకట్టుకొననివాడు నిశ్చల మనస్సుతో స్థితప్రజ్ఞుడిగా, తన గురువగు ఆ శ్రీరామచంద్రుణ్ణి తన ఆత్మగా పరమాత్మగా ఆత్మారామునిగా తలచిన దేవుడు ఆంజనేయుడు. తన హృదయంలో సీతారాములను బంధించుకొని, తన హృదయంలో ఆ సీతారాముల రూపమును చూపెను. మరి ఇన్ని జ్ఞాన లక్షణములు కల్గివున్నను గుప్తముగా, ధ్యానములో వుంటూ నిత్యనామస్మరణముతో తన ఆత్మయే పరమాత్మగా తలచి పూర్తతత్త్వజ్ఞానిగా, సచ్చితానందుడిగా ఆత్మధర్మములను ఎఱిగినవాడు కావుననే ఆ రాముడు, సీతామాత ద్వారా ఆంజనేయునికి ఆ రామతత్త్వమును ఉపదేశింపచేసి బ్రహ్మజ్ఞానిగా మార్చెను.
“మంగళ హారతి గొను హనుమంతా ! సీతారామలక్ష్మణ సమేతా నా అంతరాత్మ నీలుమో అనంతా నీవే అంతా శ్రీ హనుమంతా!" భజే వాయుపుత్రం - భజే బ్రహ్మతేజం